ఏకాదశ రుద్రులు - కోనసీమ

సంక్రాంతిలో మూడవ రోజైన కనుమ పండుగలో ప్రముఖమైన ప్రభల తీర్ధంగురించి క్లుప్తంగా......
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒకేఒక్క చోటు, అదీ వేదసీమ అయినటు వంటి కోనసీమలోనే.
400 ఏళ్ళ పైబడి చరిత్ర కలిగి, కోనసీమ అందాలు ఇంద్రదనసుల్లా కొలువు తీరే ప్రభల తీర్ధం కన్నుల పండుగలా కనుమనాడు జరుగుతుంది.
కోనసీమ లో 84 చోట్ల జరిగే ఈ ప్రభల తీర్ధాల్లో జగ్గన్నతోట , వాకలగరువు ,కొర్లగుంట ప్రసిద్ధి గాంచినవి. కొత్తపేట పరిసర గ్రామాల ప్రభలతీర్ధం నేడే అంటే సంక్రాంతి పెద్ద పండుగ రోజునే కొత్తపేటలో ఘనంగా జరుపుతారు భక్తి శ్రర్ధలతో తీర్చిదిద్దిన ప్రభలను తీర్ధాలు జరిగే ప్రాంతాలకు తరలించేందుకు పురాతనంగా ఉన్న రహ దారులను వాడతారు మార్గమధ్యలో పంట కాల్వలు ఉన్నా వరి చేలు ఉన్నాఛేదించి వెళ్ళటమే వీటి ప్రత్యేకత ఇవి కనులారా వీక్షించేందుకు అధిక సంఖ్యలో స్థానికులతోపాటు విదేశాలలో స్థిరపడిన కోనసీమ వారు ప్రభల ఉత్సవాలకు వస్తుంటారు
మారుతున్న కాలంలో నాటికీ నేటికి సాంస్కృతిక సంప్రదాయాలకు ఆదరణ తగ్గలేదనటానికి ఈ ప్రభల ఉత్సవాలే ఉదాహరణ ..
కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది.మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోాని "మొసలిపల్లి శివారు జగ్గన్నతోట" లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన,చారిత్రాత్మకమైన,అతిపురాతనమైన,పవిత్రమైన సమాగమము.ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి.ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు.ఇది పూర్తిగా కొబ్బరి తోట.ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం తో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది ఏకాదశ రుద్రుల కొలువు.
లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి.సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా
1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ) - 8th
2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి) - 4th
3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి - 7th
4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు - 9th
5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు - 10th
6-పెదపూడి-మేనకేశ్వరుడు - 6th
7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు - 5th
8-వక్కలంక-విశ్వేశ్వరుడు - 3rd
9-నేదునూరు--చెన్న మల్లేశ్వరుడు - 2nd
10-ముక్కామల-రాఘవేశ్వరుడు - 1st
11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు - 11th
ఇవీ గ్రామాలు ఆ గ్రామాల రుద్రుల నామాలు.ఈ స్వామి వారలను "ప్రభలపై" అలంకరించి మేళ తాళాలతో,మంగళ వాయిద్యాలతో,భాజా బజంత్రీలతో "శరభా శరభా" "హర హర మహాదేవ" అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు.
ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు
"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 50 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11ప్రభలు) దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.
నమస్తే అస్తు భగవన్
విశ్వేశ్వరాయ
మహాదేవాయ
త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ
మృత్యుంజయాయ
సర్వేశ్వ’రాయ
సదాశివాయ
శ్రీమన్-మహాదేవాయ నమః’ అంటూ రుద్రం లో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.
ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలం లో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది
ఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.....

Comments

  1. Adbhutam ga vivarinchavu Sivayya..

    ReplyDelete
  2. Me explanation chala bagundi.
    Temple choodali ane kuthhalam kalugutundi.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం