వారణాసి విశేషాలు

విశ్వేశ్వర జ్యోతిర్లింగం, వారణాసి
మహాప్రళయ కాలంలో అవిముక్త నగరం, ఆదిదంపతులకు ఆనందకాననం, మర్త్యలోకంలో మహాశివుడు నివసించే మహాస్మశానం, విశ్వేశ్వరలింగం జ్యోతిర్లింగంగా వెలసి, స్వయంగా శివుడే నిర్మించాడని చెప్పే వారణాసి. కాశ్యాంతు మరణాన్ ముక్తిః – కాశీ పట్టణంలో మరణించడమే మోక్షదాయకం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలం మీద నిలబెట్టాడని చెప్పే నగరం కాశీ. దీనికి బిందుమాధవ క్షేత్రం అనే పేరు కూడా ఉంది.
ఋగ్వేదంలో ఈ పట్టణాన్ని జ్యోతిస్థానం అని వర్ణించారు. జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, ముక్తినగరంగా వినుతికెక్కిన కాశీ (వారణాశి) స్మరణ మాత్రం చేతనే సప్తజన్మల పాపాలనూ పోగొట్టగల మహిమ కలది. వాసం చేతనే వాసనా బలాన్ని జయించగల శక్తిని ప్రసాదించే వారణాసి, సురనది అయిన గంగానదీ తీరాన ఉన్న పుణ్యనగరం.

విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్తోత్రం: 
సానంద మానందవనే వసంత మానందకందం హతపాపబృందమ్
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

స్థలపురాణం:-
శివ పురాణం ప్రకారం – సృష్టి నిమిత్తం పరమేశ్వరుడు ప్రకృతి, పురుషులను సృష్టించి, వారిని తపస్సు చేయమని ఆదేశించాడు. అపుడు వారు తపమునకు తగిన ప్రదేశము ఏది అని అడుగగా, ఐదు క్రోసుల పొడవు, వెడల్పుతో ఒక నగరాన్ని సృష్టించి, అదే వారికి తగిన స్థలము అని చెప్పాడు. అదే కాశీ పట్టణం. సదాశివుడు తానే ఒక లింగాన్ని సృష్టించి కాశీ విడువరాదని ఆజ్ఞాపించాడు. ఆ లింగం అవిముక్తేశ్వరుడు గానూ, కాశీ అవిముక్తం గానూ పిలువబడుతున్నాయి. ఆ పురుషుడే శ్రీ మహావిష్ణువు. ప్రాణికోటి దుష్కృతాలన్నింటినీ నశింపచేసేది కాబట్టి కాశీ అయింది. ప్రకాశించేది కాశి.

ఆలయ చరిత్ర:-
ప్రపంచంలో అతిపురాతనమైనదిగా భావించబడుతున్న కాశీ (వారణాసి), వేదాల కాలం నుండీ ఉన్నది. దేవతల కోరికపై శివుడు ఈ కాశీ నగరాన్ని తన ఆవాసంగా చేసుకుని, స్వయంభువుగా, విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంస్కృతీ పరంగా, కళల పరంగా, మత, విద్యా, వ్యాపార పరంగా ఉచ్ఛస్థితిలో ఉండేది. 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు శివారాధన విధానాలను ప్రారంభించిన తరువాత మరింత ప్రసిద్ధి కెక్కింది. కానీ క్రీ.శ .1194 లో కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో నగరంలోని సుమారు 1000 ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దానికి కొనసాగింపుగా క్రీ. శ. 1496 లో సికిందర్ లోధి మిగిలిన ఆలయాలను ధ్వంసం చేయించాడు. 13, 14 శతాబ్దాల కాలంలో హహిందూధర్రక్షణకై భక్తి ఉద్యమాలు బయలుదేరాయి. కబీర్ దాస్ ఆ కాలానికి చెందిన వాడే. ఆ కాలంలో వారణాసి నగరానికి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగినప్పటికీ, మరలా ఔరంగజేబు కాలంలో తిరిగి క్షీణదశకు చేరుకుంది. అతని మరణం తర్వాత తిరిగి సంస్కృతీ పరంగా అభివృద్ధి చెందింది. 

ప్రస్తుతం వారణాసిలోని పలు ఆలయాలు హిందూ రాజపుత్రులు, మరాఠా రాజుల చేత నిర్మించబడ్డాయి. ప్రధాన ఆలయమైన విశ్వేశ్వర ఆలయాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ 1780 లో నిర్మించింది. ఔరంగజేబు కాలంలో ఈ ఆలయం మీద దాడి జరుగబోతున్నప్పుడు, అర్చకులు విశ్వేశ్వరలింగాన్ని బావిలో దాచారట. తరువాత ఆలయ పునర్నిర్మితమైనపుడు ఆ లింగం లుప్తమై(మాయమై)పోయిందని రాణికి శివుడు కలలో కనిపించి చెప్పగా, ఇంకొక లింగాన్ని చేయించి ప్రతిష్ట చేసేరని చెప్తారు. అసలైన ఆలయప్రదేశంలో ఔరంగజేబు మసీదు నిర్మించాడనీ , అది ఇప్పుడున్న ఆలయానికి కొద్దిదూరంలో ఉందనీ అంటారు. అక్కడ ఉన్న బావిలోనే, తొలి లింగం లుప్తమైపోయింది. మహా ప్రళయాలెన్నో వచ్చి బ్రహ్మాండాలన్నీ లయం అయిపోయినా, కాశీ పట్టణం ఒక్కటీ నిలిచిఉంటుంది అన్న పురాణోక్తికి అనుగుణంగా ఎన్ని విధ్వంసాలు జరిగినప్పటికీ, ఎన్ని ఆటుపోట్లకి గురైనప్పటికీ, వారణాసి తన వైభవాన్ని కోల్పోలేదు. కాశీ రాజుల ఆధ్వర్యంలో చాలాకాలం ఆలయ నిర్వహణా బాధ్యతలుండేవి. ఇప్పటికీ కాశీరాజుల వారసులకి ప్రత్యేక స్థానం ఉంది.

విశ్వనాథ ఆలయ ప్రత్యేకతలు:-
ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది అయిన ఈ విశ్వనాథ ఆలయం బంగారుపూత గల గోపురంతో నిర్మించబడి, బంగారు మందిరం అని పిలువబడుతోంది. ఆలయ గర్భగుడి చాలా చిన్నది. ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. గర్భాలయ కుడ్యాలపై సీతారామలక్ష్మణులు, దశభుజ వినాయకుడు, కాలభైరవుడు, శక్తి, యోగాసనంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు ఉంటారు. ఆలయంలో అవిముక్తేశ్వర లింగం, పార్వతీదేవి ఆలయం వంటి ఉపాలయాలున్నాయి.
గంగా స్నానం:
విశ్వనాథుని దర్శనం ఎంత పుణ్యప్రదమో, గంగాస్నానం కూడా అంతే పుణ్యప్రదం. స్నానం ఒక్కటే కాదు, ఇక్కడున్న ఘాట్ లలో దహన సంస్కారాలు, పితృకార్యాలు, అస్తికల నిమజ్జనం వంటివి నిత్యం గంగానదీతీరంలో చోటు చేసుకునే కార్యక్రమాలు. పర, అపర కర్మలు రెండింటికీ సమానమైన ప్రాతినిథ్యం కలది గంగాతీరం. గంగానది హిమాలయాలలో పుట్టినది మొదలు ఎన్నో ప్రదేశాలలో ప్రవహిస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రమే కాశీగంగ అని పిలువబడటానికి కారణం, విశ్వనాథుడు కొలువై ఉండటం ఒక్కటే కాదు, అప్పటి వరకూ దక్షిణాభిముఖంగా ప్రవహిస్తున్న గంగ ఇక్కడనుండి తన దిశ మార్చుకుని, ఉత్తరాభిముఖంగా పయనమౌతుంది.
వరుణ, అసి అనే రెండు నదులు గంగానదితో సంగమించే మధ్య ప్రదేశమే వారణాసి. ఈ రెండు నదుల సంగమ స్థానం మధ్య ఉన్న ఐదు క్రోసుల దూరాన్ని భక్తులు “పంచక్రోస యాత్ర” గా పిలుచుకుని ఈ వారణాసి యాత్ర ఎంతో సంతోషంతో చేస్తారు.

స్నాన ఘట్టాలు:
ఆధ్యాత్మికంగా, భౌతికంగా పవిత్రమైన భావాలకు ప్రతీకలైన ఈ స్నాన ఘట్టాలు గంగా తీరంలో 84 ఉన్నప్పటికీ, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, పంచగంగా మరియు హరిశ్చంద్ర ఘాట్, కేదార ఘాట్లు ప్రత్యేకమైనవి.

దశాశ్వమేధ ఘాట్ :-
బ్రహ్మ స్వయంగా పది అశ్వమేధ యాగాలు చేసి, శివుని ఇక్కడ కొలువుండమని అడిగాడని పురాణ కథనం. ప్రతీరోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్నిపూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ ప్రతీరోజూ సాయంకాలం గంగా హారతి జరుగుతుంది. ప్రధాన ఆలయమైన విశ్వనాథ ఆలయం ఇక్కడికి దగ్గర లోనే ఉంది. ఇంకా శూలకంఠేశ్వరుడు, వరాహేశ్వరుడు, గంగా, బండీదేవి మొదలైన ఆలయాలున్నాయి.

మణికర్ణికా ఘాట్:-
శివుని ప్రసన్నత కోసం ఇక్కడ శ్రీమహావిష్ణువు తన సుదర్శనచక్రంతో ఒక గోతిని తవ్వాడని, అప్పుడు ఆయన స్వేదంతో ఆ గొయ్యి నిండిందనీ, అప్పుడు శివుడు ప్రత్యక్షమై దానిని పరవశుడై చూస్తుండగా, ఆయన కుడి చెవిపోగు (మణికర్ణిక – మణులతో కూడిన చెవిపోగు) జారి ఆ సరోవరంలో పడిందనీ పురాణ కథనం. అందుకే దానికి మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చింది. శివకేశవులకు అభేదమనీ, వారి అన్యోన్యతకు గుర్తుగా నిలుస్తుంది ఈ ప్రదేశం. ఈ ఘాట్ లో మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేసి మణికర్ణికా స్తవం చదివితే మంచిది. ఈ మణికర్ణికా ఘాట్ కే మహా స్మశానమని మరో పేరు. ఇక్కడే దహనసంస్కారాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ఘాట్ వద్దనున్న తారకేశ్వరాలయంలోని శివుడు, కాశీ పట్టణంలో ప్రాణావసాన సమయంలో ఉన్న జీవులకు స్వయంగా పార్వతీ, గంగ, గణేశుడు, భ్రుంగి మొదలైన వారితో కలిసి వచ్చి తారకమంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడని, ఇక వారికి మరుజన్మ ఉండని విధంగా మోక్షాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. అందుకే అంటారు “కాశ్యాంతు మరణాన్ ముక్తిః” అని.
హరశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్న హరశ్చంద్ర ఘాట్, తులసీదాసు రామచరిత మానస్ రచించిన ప్రదేశం అని చెప్పబడే తులసీ ఘాట్ మొదలైనవి కూడా ముఖ్యమైనవే.

వారణాసి లో దర్శనీయ స్థలాలు:-
అన్నపూర్ణా దేవి ఆలయం:-
భక్తులను తన బిడ్డలవలె చూస్తూ కాశీ లో అడుగుపెట్టిన ఎవ్వరూ కూడా పస్తులు ఉండకుండా చూసే అన్నపూర్ణమ్మ తల్లి, ఇక్కడి అమ్మవారు. అమ్మవారి చేతులలో బంగారు పాయస పాత్ర, గరిట దర్శనమిస్తాయి.
అడగకుండా ఆకలి తీర్చడంతో పాటు జ్ఞాన వైరాగ్యాలను కూడా ప్రసాదించే తల్లి. స్వయంగా ఆ ఆదిదేవుడే ఆదిభిక్షువై అమ్మ వద్ద భిక్షను స్వీకరించాడు. అ తల్లిని మనం కోరుకోవలసింది జ్ఞాన వైరాగ్యాలనే భిక్షే కానీ లౌకికమైన కోరికలు కాదు.

విశాలాక్షి ఆలయం:-
శక్తిపీఠం అయిన విశాలాక్షి ఆలయం సతీదేవి కర్ణాభరణం పడిందని చెప్పబడుతున్న ప్రదేశం. కొంతమంది అమ్మవారి మణికట్టు పడిందని కూడా అంటారు. శివునితో సమానంగా శక్తి కూడా పూజలందుకునే పరమ పావనమైన ప్రదేశం.

కాలభైరవస్వామి ఆలయం :-
కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలంటే ముందుగా కాలభైరవుని దర్శించుకుని, ఆయన అనుమతి తీసుకుని వెళ్ళాలి. కాలభైరవుని ఆవిర్భావమేమనగా, బ్రహ్మగారు తన పంచముఖాల వల్ల వచ్చిన అహంభావంతో ఈశ్వరుణ్ణి చులకనగా మాట్లాడగా, ఈశ్వరుడు కోపంతో హుంకరించాట్ట. అప్పుడు ఆ హుంకారం నుండి కాలభైరవుడు ఆవిర్భవించి బ్రహ్మగారి ఐదోతలని తెగగొట్టాడు. అయితే, ఆ బ్రహ్మ తల అతని చేతికి అతుక్కుపోయింది. బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడం కోసం లోకాలన్నీ తిరిగినా లాభం లేకపోయింది. చివరకు కాశీ పట్టణం రాగానే ఆ తల ఊడిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుణ్ణి కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉండమని ఆదేశం ఇచ్చాడు. బ్రహ్మహత్యాపాతకాల నుండి సైతం విముక్తి కలిగించే ముక్తినగరం కాశి. కాశీకి వచ్చిన వారి పాపపుణ్యాల చిట్టాలు ఈయనే చూస్తుంటాడుట.
ఇంకా సంకట మోచన హనుమాన్ ఆలయం, రోజుకు తిలపరిమాణంలో పెరిగే తిలభాండేశ్వర సజీవ లింగం, స్మరణ మాత్రం చేత మోక్షం ఇవ్వగల కేదారేశ్వర లింగం, అపమృత్యుదోషాలు తొలగించే మృత్యుంజయ మందిరం, తులసీ దాసు రామాయణాన్ని రచించిన తులసీ మానస మందిరం, నీలకంఠేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, డుంఠి గణపతి ఆలయం వంటివి కొన్ని ప్రముఖ దర్శనీయ స్థలాలు.

కవళీ మాత మందిరం:-
పూర్వం శివుని భక్తురాలైన కవళి అనే ఆమె నిత్యం గంగానదిలో స్నానం చేసి శివుని పూజిస్తుండేది. ఒకనాడు ఆమె అలాగే గంగానదిలో స్నానంచేసి వస్తుండగా ఒక హరిజనుడు ఆమెను తాకగా, తాను అపవిత్రమైపోయానని భావించిన ఆమె మరలా స్నానం చేసి వచ్చింది. మరలా ఆమెను హరిజనుడు తాకాడు.అలా ఎన్నిసార్లు ఆమె స్నానం చేసి వచ్చినా ఆమెను హరిజనుడు తాకుతూనే ఉన్నాడు. అలా రాత్రి అయిపోవగా అన్నపూర్ణ ప్రత్యక్షమై కాశీలో ఎవరూ పస్తులు ఉండరాదు కావున నీవు భోజనం చేయమని చెప్పింది. కాని కవళి శివదర్శనం కానందున నిరాకరించింది. అందుకు అన్నపూర్ణ కోపంతో కాశీ వదిలి వెళ్ళమని ఆదేశించింది. కవళి తానిక రోజూ శివపూజ చేయలేనందుకు దిగులుతో తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, నీవు హరిజనుడు అనే భేదభావం చూపినందుకు నీకీ స్థితి వచ్చింది. నా సృష్టిలో అందరూ సమానులే. నువ్వు నా యందు అమిత భక్తి కలదానివి కాబట్టి, ఇక నుండీ, కాశీకి వచ్చి, నన్ను దర్శించుకున్న నా భక్తుల దర్శనఫలమ్ నీకే చెందుతుంది అని వరమిచ్చాడు. అందుకే విశ్వనాథ దర్శనం తరువాత భక్తులు కవళీ మాత దర్శనం చేసుకుని, గవ్వలు సమర్పించి, “గవ్వలు నీకు ఇస్తున్నాము, మా దర్శన ఫలం మాకు ఇయ్యి” అని వేడుకుంటారు. ఆ మాత అనుగ్రహం వల్ల ఆ దర్శన ఫలాన్ని పొందుతారు.

వ్యాస కాశీ:-
వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసాడని చెప్పబడుతున్న ప్రదేశం. వ్యాసుని పరీక్షించడానికి శివుడు ఒకసారి అతనికి వారంపాటు ఆహారం దొరకకుండా చేసాడు. ఆగ్రహించిన వ్యాసుడు కాశీని శపించబోవడానికి సిద్ధపడగా అన్నపూర్ణ ఒక ఇల్లాలి రూపంలో వచ్చి వారికి అన్నపానీయాలు ఇచ్చింది. తరువాత శివుడు ప్రత్యక్షమై, అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసుడు కోపాన్ని నిగ్రహించుకోలేదు కాబట్టి కాశీని విడిచి వెళ్లాలని చెప్పాడు. అప్పుడు దిగులుపడుతున్న వ్యాసునితో అన్నపూర్ణ, దక్షిణ కాశి అయిన దక్షారామం వెళ్ళమని చెప్పింది. అలా వ్యాసుడు దక్షారామం చేరుకున్నాడు.
ఇలా పురాణాలతో ముడిపడి ఉన్న మహిమకల ఆలయాలు ఎన్నో వారణాసిలో ఉన్నాయి. ప్రతీ ఆలయం దివ్యమైనదే. భక్తులకు పాపాలు హరించి, పుణ్యఫలాన్ని ఇచ్చేవే. కాశీక్షేత్ర మహిమ గురించి ఎంత చెప్పినా తరగని అక్షయ భాండం. శివపురాణం, స్కాందపురాణం, వంటివి ప్రముఖంగా ఈ క్షేత్రమహిమని వివరిస్తాయి. శ్రీనాథుడు అయితే ఏకంగా కాశీఖండమే రచించాడు.

వారణాసి లో జరిగే ప్రత్యేక ఉత్సవాలు:-
వారణాసిలో ప్రతీరోజూ సాయంకాలం భక్తులకు నయనానందకరంగా ఉండే గంగాహారతి నిర్వహిస్తారు.
మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకూ జరుగుతుంది. కార్తీక పూర్ణిమ నాడు గంగా మహోత్సవాలు జరుగుతాయి.
కార్తీక మాస కృష్ణ చవితి నాడు కాళీయ మర్దనం, హనుమాన్ జయంతి మరియు రామాయణం ప్రదర్శన నెలరోజుల పాటు జరుగుతుంది. ఇలా శివకేశవులిద్దరి ఉత్సవాలు మహోత్సాహంతో జరుపుకుంటారు.
కదా కాశీం గమిష్యామి కదా ద్రక్ష్యామి శంకరం
ఇతి బ్రువాణస్సతతం కాశివాస ఫలం లభేత్ ||
ఎప్పుడు కాశీ వెడతానో, ఎప్పుడు విశ్వేశ్వరుని దర్శిస్తానో అని మనసులో సదా తపించేవారికి కాశీ వాస ఫలం లభిస్తుంది.

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం